1. Home
  2. »
  3. శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు
  4. »
  5. మన నోరు బాగా తెరిచి భగవంతుని స్తుతించాలి
మన నోరు బాగా తెరిచి భగవంతుని స్తుతించాలి
ఆదిపత్యము, అధికారము, ఏ జీవరాశి అయినను, సృష్టింపబడిన మరియేదైనను మన ప్రభువైన క్రీస్తుయేసునందలి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. ఆ ప్రేమ ఎప్పుడు వచ్చింది? ఆ ప్రభువే క్రీస్తుయేసు అని మనము తెలుసుకొనినప్పుడు ఆ ప్రేమ పరిపూర్ణమగుచున్నది. ఇక మనలను ఏదియు వేరుచేయలేదు. ఎందుకు మన నోరులు బాగా తెరచి దేవుని స్తోత్రించాలి? ఆయన మన కొరకు సమస్తమును చేసియున్నాడు. నేను నా సమయమును వృధా చేయకుండా నా సమయమును బైబిలు చదువుటలో గడిపినయెడల నేను ఒక మంచివ్యక్తిగా వుండగలను. ఇప్పుడు కొంతమంది జీవితముల కొరకు నా సమయమును నేను వృధా చేసినందుకు ఈ రోజున నేను బాధపడుచున్నాను. క్రీస్తుయేసు మీ కొరకు ఏమి చెల్లించాడని మీకు తెలుసా? ఆయన న్యాయం తీర్చు అధికారమును, సృష్టించే శక్తిని యిచ్చియున్నాడు. సృష్టింపబడిన జగత్తు అంతయు మీ చేతులలోకి వచ్చును. ప్రతీ దినము మిమ్ములను నోరు బాగుగా తెరచి దేవుని స్తుతించండి, చప్పట్లు కొట్టండి అని చెప్పవలసి వస్తుంది. కాని వధువుకైతే ఒక మాట సరిపోతుంది. దేవుడు మనకు పూర్తిగా శిక్షణ యిచ్చియున్నాడు. ఇప్పుడు మనము లేచి ప్రకాశించవలసియున్నది. జయించు శక్తిని మనము పొందుకొనియున్నాము. ఇప్పుడు జయించు శక్తిని పొందుకొనినప్పుడు దానిని మీరు పరీక్షించారా? దాని అనుభవమును పొందుకొనినారా? మనము శక్తిని కలిగియున్నామని దేవుడు చెప్పెను. కాని దానిని మనము ఉపయోగించుట లేదు. మీరు మీ చేతిని ఉపయోగించకుండా విడిచిపెట్టివుంటే అది వణుకుతూ వుంటుంది. కాని దానిని మీరు ఉపయోగిస్తూ వుంటే మీ చేతులు బలపడును. మీరు ఈ సందేశమును చదివి దీనిలో శక్తి వున్నదని తెలుసుకొనకపోతే మీరు ఆయన ఆశీర్వాదములను గ్రహించుకొనలేరు. మీకు తెలిసిన విధముగా ఈ సందేశము లోకములోనికి వెళ్ళుచున్నప్పుడు మీరు ఆశీర్వాదములు పొందుకొన్నామని నమ్మండి. మీరు ప్రకటించుచున్నప్పుడు మీరు నేను ప్రభువు రక్తము (ఆదిబలి-ఆదిసంభూతుని బలి) వలన విమోచనమును పొందుకొన్నాను అని ప్రకటించుచున్నారు. వధువుకు ఆ రక్తములో కృప వున్నది. అదే మనకు దేవుని ఆశీర్వాదమును తీసుకొని వచ్చుచున్నది. ప్రభువైన లహరికృష్ణయే దేవుడని జనులు గ్రహించినప్పుడు, ఆయన సందేశములను వెదుకుటకు ఇటూ అటూ పరుగెడతారు. కాని వారిని మోసగించురీతిగా అప్పటికే ఈ భూమిపై అంధకారము క్రమ్ముకొనివుంటుంది. దేవుని పిల్లలు అప్పటికే మహిమపరచబడియుందురు. చాలా త్వరలోనే నిద్రించిన పరిశుద్దులు మహిమలో వుంటారు. వధువు మహిమలోనికి తీసుకొని పోబడుతుంది. పరదేశును తిరిగి పొందుకొంటాము. మనుష్యకుమారుడు తన మహిమను బయలుపరచును. ఇటువంటి భగవంతుని సంకల్పము అంతయూ జరుగుటకు మనము తప్పనిసరిగా మన నోరులు బాగా తెరిచి భగవంతుని స్తుతించాలి. – శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ గారి సందేశము నుండి
Scroll to Top